Milk Price - సామాన్యుడిపై మరో పిడుగు: ఇక పాల వంతు!
లీటరు పాలపై రూ.12లు పెంచాలని ఉత్పత్తిదారుల నిర్ణయం
దిల్లీ: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, కూరగాయల ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు పడనుంది! పాల ధరలు పెంచాలని మధ్యప్రదేశ్ రత్లాంలోని పాల ఉత్పత్తిదారులు నిర్ణయించారు. ఇదివరకు ఎన్నడూ లేనంతగా మార్చి1 నుంచి లీటర్ పాల ధరపై రూ.12ల చొప్పున పెంచాలని నిర్ణయించారు. దీనిపై పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు హీరాలాల్ చౌదరి మాట్లాడుతూ.. 'దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మంగళవారం 25 గ్రామాలకు చెందిన పాల ఉత్పత్తిదారులం సమావేశమయ్యాం. పాల ధరలను పెంచాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
గతేడాది కూడా రూ.2లు పెంచాలని నిర్ణయించినా.. సరఫరాదారులతో అంగీకారం కుదరలేదు. దీనికితోడు కరోనా సంక్షోభం రావడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్లకు తోడుగా పశు దాణా ధరలు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పాల ధర రత్లాంలో రూ.43గా ఉంది. దాన్ని రూ.55లకు పెంచాలని నిర్ణయించాం. దీనిపై నగరంలోని పాల విక్రయదారులతో చర్చలు జరుపుతాం'' అని వివరించారు.
దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టగా.. ఉల్లిధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో సామాన్యుడి బతుకు బండి భారంగా మారుతోంది. పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతిఒక్కరూ తీసుకొనే పాల ధరలు పెరిగితే సామాన్యుడి జీవనం మరింత భారం కానుంది.
0 comments:
Post a comment