బలనిరూపణలో విఫలమైన నారాయణస్వామి
పుదుచ్చేరి: పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. శాసనసభలో తన మెజారిటీ నిరూపించుకోవడంలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. బలపరీక్ష కోసం పుదుచ్చేరి శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానంపై ఓటింగ్ జరగకముందే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ వీపీ శివకొలుందు ప్రకటించారు. మరోవైపు సీఎం తన పదవికి రాజీనామా చేసేందుకు శాసనసభ నుంచి నేరుగా రాజ్భవన్కు బయల్దేరారు.
అక్కడ ఎల్జీ తమిళసైని కలిసి తన రాజీనామా అందజేసినట్లు నారాయణస్వామి ప్రకటించారు.
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
అంతకుముందు సీఎం శాసనసభలో మాట్లాడుతూ.. ''డీఎంకే మద్దతుతో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఉప ఎన్నికల్లోనూ గెలిచాం. పుదుచ్చేరి ప్రజలకు మాపై నమ్మకం ఉందని ఆ ఎన్నికలు నిరూపించాయి. అయితే మాజీ ఎల్జీ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం.. ప్రతిపక్షంతో చేతులు కలిపి మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నోసార్లు మేం నిధులు అడిగినా కేంద్రం మంజూరు చేయలేదు. ప్రభుత్వ కార్యకలాపాలను కిరణ్ బేడీ అడ్డుకున్నారు'' అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.
ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు సహా 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల అనంతరం 26 మంది ఉన్నారు. నారాయణస్వామి ప్రభుత్వం గట్టెక్కాలంటే 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ అధికార కాంగ్రెస్ కూటమి బలం 12కి తగ్గింది. ఇందులో కాంగ్రెస్ నుంచి 10(స్పీకర్తో కలిపి), డీఎంకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు విపక్ష పార్టీ అయిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి బలం 14(ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ భాజపా ఎమ్మెల్యేలు ముగ్గురు)గా ఉంది.
ఎమ్మెల్యేల రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా కిరణ్బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పించి.. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన తమిళసై.. నారాయణస్వామి ప్రభుత్వం సోమవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
0 comments:
Post a comment