Sasikala: నేడు జైలు నుంచి శశికళ విడుదల.. తమిళనాడులో ఏం జరగబోతోంది?
తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. 4 ఏళ్ల తర్వాత ఆమె జైలు నుంచి విడుదల అవుతున్నారు. శశికళ కరోనా బారినపడడంతో ప్రస్తుతం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విడుదల ప్రక్రియను ఆస్పత్రిలోనే పూర్తి చేస్తామని జైలు అధికారులు చెప్పారు. శశికళకు జనవరి 20న ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత నెగెటివ్ వచ్చింది. మరో టెస్ట్లో మాత్రం మళ్లీ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె విక్టోరియా ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి అవుతారన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికి ఆమెకు కరోనా లక్షణాలేవీ లేవని డాకర్టు తెలిపారు. ఐనప్పటికీ కోవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తే వెళ్లిపోవచ్చు. ఈ నేపథ్యంలో శశికళను బెంగళూరు నుంచి తమిళనాడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శశికళ జైలు నుంచి విడుదల కాగానే భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం అధినేత, ఎమ్మెల్యే దినకరన్ టీమ్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రూ. 66 కోట్ల అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలడంతో జైలుపాలయ్యారు.
ఆ కేసులో నాలుగేళ్ల జైలు శిక్షపడింది. 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో శశికళ బంధువులు జే ఇళవరసి, బీ ఎన్ సుధాకర్కు కూడా శిక్షపడింది. ఇళవరసిికి కూడా కరోనా సోకింది.
కానీ ఎలాంటి లక్షణాలు లేవు. ఆమెను ఫిబ్రవరి మొదటి వారంలో జైలు నుంచి విడుదల చేస్తారు. ఐతే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సమయంలోనే శశికళ జైలు నుంచి విడుదలవుతున్న నేపథ్యంలో.. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
0 comments:
Post a comment