ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గతంలో జగన్ సర్కారు అండగా ఉందన్న ధీమాతో బిజినెస్ రూల్స్ను కూడా పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు సైతం ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆగ్రహానికి గురవుతున్నారు. వీరి విషయంలో సరైన సమయంలో చర్యలు తీసుకుంటానని ప్రకటించిన నిమ్మగడ్డ వరుసగా కొరడా ఝళిపిస్తున్నారు. దీంతో వారు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. అయితే తాజాగా ఎస్ఈసీ అభిశంసనకు గురైన ఇద్దరు అధికారులను ఎన్నికలు ముగిశాక కాపాడతామని జగన్ సర్కారు ఇస్తున్న హామీ వాస్తవ రూపం దాల్చడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగిందని తెలిసీ ఓటర్ల జాబితాలను తయారు చేసి ఎన్నికల సంఘానికి అందించాల్సింది పోయి జగన్ సర్కారు అండతో బిజినెస్ రూల్స్ను కూడా ధిక్కరించిన ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తున్న సమయంలోనే వీరి నిర్వాకంతో రాష్ట్రంలో 3.6 లక్షల మంది ఓటుహక్కు ఉండి కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిపై సరైన సమయంలో చర్యలు తప్పవన్నారు. అనుకున్నట్లుగానే సుప్రీంకోర్టు తీర్పు రాగానే వీరిపై కొరడా ఝళిపించారు. కేవలం బదిలీతో సరిపెట్టకుండా రాష్ట్ర స్దాయిలో అరుదుగా వాడే అభిశంసన ద్వారా వీరిద్దరి సర్వీసు రికార్డుల్లో బ్లాక్ మార్క్ వేసేశారు. దీంతో వీరి కెరీర్కు ఇదో మచ్చలా మారే ప్రమాదం కనిపిస్తోంది.
అభిశంసనతో కలిగే నష్టాలివే...
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీసుకున్న అభిశంసన నిర్ణయంతో ఇద్దరు ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్ల కెరీర్పై బ్లాక్ మార్క్ పడటం ఖాయం. అంతే కాదు వీరు భవిష్యత్తులో కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై వెళ్లాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా ఇబ్బందులు తప్పవు. కేంద్రానికి డిప్యుటేషన్కు వెళ్లేందుకు ఏడాది ఆగాల్సి ఉంటుంది. అలాగే ప్రమోషన్లు ఇవ్వడం కూడా కష్టమే. ఇంకా ఎన్నో విషయాల్లో వీరికి ప్రభుత్వం తరఫున ఏ ప్రయోజనం పొందాలన్నా ఇది అడ్డుగా నిలుస్తుంది. కేంద్రం జోక్యం చేసుకుని ఈ మచ్చ తొలగిస్తే తప్ప వీరికి తిరిగి యథావిధిగా డిప్యుటేషన్లు, ప్రమోషన్లు, ప్రయోజనాలు లభించవు.
అభింశంసన ఐఏఎస్లకు జగన్ సర్కార్ భరోసా
పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా రాష్ట్రంలో 3.6 లక్షల మంది కొత్త ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేసిన వ్యవహారంలో ఎస్ఈసీ అభిశంసనకు గురైన ఐఏఎస్లు జీకే ద్వివేదీ, గిరిజాశంకర్లకు జగన్ సర్కారు అభయమిస్తోంది. ఏ అధికారికీ అన్యాయం జరగనివ్వబోమని పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి భరోసా ఇచ్చారు. వారి విశ్వసనీయతను, ఆత్మస్ధైర్యాన్ని కాపడతామన్నారు. ఓసారి ఎన్నికల కోడ్ ముగిసిపోయాక వారిపై నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తామని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకూ సాధ్యమన్నదే ఇక్కడ ప్రశ్న.
క్లీన్ చిట్ ఇవ్వడం అసాధ్యమేనా ?
అఖిల భారత సర్వీసు అధికారుల కెరీర్ అంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాలశాఖ డీవోపీటీ పరిధిలో ఉంటుంది. వీరిపై అభియోగాలు లేదా అభిశంసనల నమోదు అధికారం రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, కోర్టులు ఇలా పలువురి చేతుల్లో ఉంటుంది. కానీ వీటిని మార్చాలంటే మాత్రం తిరిగి డీవోపీటీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాదని ఎన్నికల సంఘం నమోదు చేసిన అభిశంసనను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని తెలుస్తోంది. మరి ఏ అధికారంతో ఎస్ఈసీ నిర్ణయాన్ని సవరించి అధికారులకు అన్యాయం జరగకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
0 comments:
Post a comment