ఆంధ్రప్రదేశ్లో 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పథకం కింద పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణాన్ని డిసెంబర్ 25న చేపట్టనున్నారు. 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు పంపిణీ, అదే రోజు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 7 వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారు. మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అందించనున్నారు. రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు.
కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక వేసింది. పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నారు. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభించనున్నారు. 8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతారు. టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించనుంది. 300 చదరపు అడుగుల ఫ్లాట్లను కేవలం ఒక రూపాయికే ప్రభుత్వం అందించనుంది.
కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందు కెళ్లాలని సీఎం చెప్పారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలన్నారు. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.1. లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే ఇళ్లు కట్టించి ఇస్తారు.
2. మెటీరియల్ ఇవ్వండి, లేబర్ కాంపొనెంట్కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తారు.
3. డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు.
ఇటీవల వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అవసరమైన విధంగా డ్రైయిన్లు నిర్మాణం, ఇతరత్రా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం లేకుండా, సమస్యలు లేకుండా చూడాలన్నారు. మనం కట్టేవి ఇళ్లు కావు, ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సీఎం అన్నారు. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలని సూచించారు. వీధి లైట్ల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి పెట్టాలన్నారు.
0 Comments:
Post a Comment