Telangana Ration Shops: రేషన్కు ఆధార్తో లింక్.. ఓటీపీ చెబితేనే సరుకులు
రేషన్ సరుకులు పొందే వినియోగదారులు.. ఇకపై కేవలం తమ కార్డు నెంబర్, బయోమెట్రిక్ అందిస్తే సరిపోదు. ఇందుకోసం కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇకపై రేషన్ సరుకులు పొందాలంటే మీ రేషన్ నంబర్ కచ్చితంగా ఆధార్తో అనుసంధానమై ఉండాల్సిందే. దానికి అనుసంధానమైన ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) చెబితేనే రేషన్ డీలర్లు సరుకులు వినియోగదారులకు పంపిణీ చేస్తారు. ఈ మేరకు రేషన్ సరుకులు పొందేవారికి ఆధార్ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బయోమెట్రిక్, ఐరిస్ ద్వారా చౌకడిపోల్లో పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు.
అయితే ఇక నుంచి ఆధార్ నంబర్ను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.
దీంతో ఆధార్ కార్డులు లేని వారు తక్షణమే నమోదు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాస్తవానికి ఇందుకు సంబంధించి 2017 ఫిబ్రవరిలోనే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహార భద్రత కార్డుల ఆధారంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చౌక డిపోల్లో ఈ-పాస్ మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత బయోమెట్రిక్ ద్వారా బియ్యం అందజేస్తున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు ఆహారభద్రత కార్డులో నమోదై ఉన్న ప్రతి వినియోగదారుడు.. తమ ఆధార్ జిరాక్స్ కాపీని సంబంధిత డీలర్కు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 87.55 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, వీటిలో 2.97 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఆధార్ కార్డులు లేని వారు తక్షణమే నమోదు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సూచించారు. మరోవైపు ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో రెండు నెలల నుంచి ఓటీపీతో రేషన్ బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేస్తున్నారు.
0 comments:
Post a comment