Andhra Pradesh: మీ రేషన్ కార్డు రద్దు అయ్యిందా ? ఇలా పునరుద్దరించుకోండి
కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డు రద్దయితే.. దాన్ని పునరుద్దరించుకోవడం కొంత కష్టమే. ఇందుకోసం అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కొంతకాలం క్రితం వైఎస్ఆర్ నవశకం సర్వేతో పాటు వీఆర్ఓలు, పౌరసరఫరాలశాఖ ఉద్యోగులు నిర్వహించిన విచారణలో భాగంగా బియ్యం కార్డులను రద్దు చేశారు. అనేక మందిని అనర్హత జాబితాలో చేర్చి ఈ నెలలో సరకులు నిలుపుదల చేశారు. అయితే ప్రజల విజ్ఞప్తి మేరకు అనర్హత పున: పరిశీలనకు మరో అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆయా అంశాల్లో అనర్హత సవాలు చేస్తూ సంబంధింత ధ్రువీకరణ పత్రాల్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయడం ద్వారా కార్డుల్ని పునరుద్ధరించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
అయితే ఇందుకు సంబంధించి పలు వివరాలు ప్రభుత్వ అధికారులకు అందించాల్సి ఉంటుంది.
ఆదాయ పన్ను చెల్లించకపోయినా చెల్లించినట్లు చూపించి కార్డు రద్దు చేస్తే ఛార్డెడ్ అకౌంటెంట్(సీఏ) ప్రాక్టీషనర్ నుంచి ఫారం-16 తీసుకుని సమర్పిస్తే బియ్యం కార్డును పునరుద్ధరిస్తారు. 300 యూనిట్లకంటే తక్కువ విద్యుత్తు వినియోగం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి కార్డు రద్దు చేస్తే విద్యుత్తుశాఖ ఏఈ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పిస్తే కార్డు రద్దవ్వదు. ఇక నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్లు గతంలో ఉన్న వివరాల ఆధారంగా కార్డు తొలగిస్తే ఆర్టీవో, బ్రేక్ ఇన్స్పెక్టర్ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ లేకపోయినా కార్డు తొలగిస్తే ఏ శాఖ ఉద్యోగిగా చూపించారో ఆ శాఖ పర్యవేక్షకాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. పదెకరాలకంటే తక్కువ భూమి ఉండి కూడా ఎక్కువగా ఉన్నట్లు చూపించి రద్దు చేస్తే తహసీల్దార్ నుంచి 1బీ ధ్రువపత్రం తీసుకోవాల్సి ఉంటుంది.
0 comments:
Post a comment