గూగుల్ మెచ్చిన వ్యాపావేత్త
ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత చదువులు అభ్యసించిన సంపన్నులే వ్యాపారాలు చేయగలుగుతారన్న అపోహను చెరిపేశారు ఓ 68 ఏళ్ల మహిళ. తనకున్న వ్యవసాయ భూమిని ఏకంగా ఓ దీవిగా మార్చేసి పలు రకాల వ్యాపారం చేస్తున్నారు. పదో తరగతితోనే చదువు మానేసిన ఉత్తరప్రదేశ్లోని కన్నౌగ్ గుందాకు చెందిన కిరణ్ రాజ్పూత్ ప్రస్తుతం ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు. ఇతరులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. కిరణ్.. తనకున్న 25 బిగాల వ్యవసాయ భూమిని దీవిగా మార్చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పర్యాటకంగా కళకళలాడుతోంది. ఇక్కడ బోటింగ్ చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ పెంచుతున్న చేపలు, పండిస్తున్న పండ్లు కిరణ్కు అదనపు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.
చేపలు చెరువులు ప్రారంభించేందుకు కిరణ్కు ప్రభుత్వం నుంచి రుణంగా కేవలం రూ.2 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో ఇంట్లో దాచుకున్న డబ్బుతోపాటు, బంధువుల సాయంతో మొత్తం 11 లక్షలు సమకూర్చి చేపల చెరువుపై పెట్టుబడి పెట్టారు. ఆ చేపల చెరువులను విజయవంతంగా నడుపుతూ రూ.5 నుంచి 7 లక్షల వరకు లాభం పొందుతున్నారు. ఈ దీవిపై మొత్తంగా రూ.20 నుంచి 25 లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు కిరణ్ కుమారుడు వెల్లడించారు.
'మొదట్లో అనేక కష్టాలు పడ్డాం. కొద్ది మొత్తంలో డబ్బు సమకూర్చుకొని చేపల చెరువుపై పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అదే పెద్ద వ్యాపారంగా మారింది. ఈ వ్యాపారం గురించి ఔత్సాహితులకు కూడా నేర్పించాం' అని కిరణ్ పేర్కొన్నారు. గూగుల్ సైతం కిరణ్ రాజ్పుత్ విజయాన్ని ప్రశంసించింది. ఈ ప్రాంతంలోని ఇతర రైతులకు కిరణ్ రాజ్పూత్ ఆదర్శంగా నిలుస్తున్నారు.
0 comments:
Post a comment