ఏపీలో 829మంది టీచర్లకు కరోనా!
575 విద్యార్థులకూ సోకిన వైరస్
☀️అమరావతి: ఏపీలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా బుసలు కొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 829మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్టు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 9, 10 విద్యార్థులకు ఈనెల 2 నుంచి రోజువిడిచి రోజు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తంగా 41,623 ప్రభుత్వ పాఠశాలల్లో 70,790 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయగా.. 829మందికి పాజిటివ్గా తేలింది. అలాగే, 95,763 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. 575మందిలో వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.
🎯పాఠశాలకు హాజరుకావడం వల్లే సోకిందనడం సరికాదు: విద్యాశాఖ
☀️అయితే, పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య తక్కువేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 4న దాదాపు 4లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావడం వల్లే వారికి కరోనా సోకిందనడం కూడా సరికాదని చెప్పారు. ఒక్కో తరగతి గదిలో 15 లేదా 16 మంది విద్యార్థులే కూర్చొంటున్నారని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు తమకెంతో ఎంతో ముఖ్యమని, ఒకవేళ పాఠశాలలు తెరవకపోతే ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేని పేద విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంటే వారికి బాల్య వివాహాలు కూడా జరిగే అవకాశం కూడా ఉందన్నారు. కరోనా విజృంభణతో సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత ఈ నెల 2 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
0 comments:
Post a comment