విద్యాశాఖ రివ్యూ మీటింగ్లో అధికారులకు సీఎం జగన్ సూచన
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం, స్కూల్ భవనాలన్నింటికీ కొత్తగా పెయింటింగ్స్ వేయిస్తోంది. ఆ రంగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆ మేరకు పలు రంగుల నమూనాలను అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్ రూపంలో సీఎంకు చూపారు. ఈ కార్యక్రమానికి జగన్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడితో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
స్కూల్ బిల్డింగ్లకు వేసే రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని, అక్కడ ఓ పండగ వాతావరణం కనిపించాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పిల్లలకు అన్ని విషయాలపై తగిన అవగాహన కలిగేలా స్కూల్ గోడలపై చక్కగా బొమ్మలు కూడా గీయాలని సూచించారు. ప్రజాధనం వృధాకాకుండా వర్షాకాలం తర్వాత ఆ పనులు చేపట్టి, వేగంగా పూర్తి చేయాలని చెప్పారు.
మరోవైపు మన బడి నాడు–నేడు రెండు, మూడో దశ పనులకు అవసరమయ్యే రుణ సేకరణ ప్రక్రియను మొదలుపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. మన బడి నాడు–నేడులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల రూపాయల పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు నివేదించారు. పలు చోట్ల దాతలకు అప్పజెప్పిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. దీంతో దాతలను వెంటనే ఆయా బాధ్యతల నుంచి తప్పించి, జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సీఎం ఆదేశించారు.
సచివాలయాల ఇంజనీర్లకు కొత్త బాధ్యతలు
గ్రామ సచివాలయాల ఇంజనీర్లు మన బడి నాడు–నేడు పనులను కూడా చూడాలని, వారు ప్రతిరోజూ తప్పనిసరిగా స్కూళ్లను సందర్శించాలని సీఎం జగన్ సూచించారు. వారానికి ఒకసారి పనులపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. స్కూళ్లకు సంబంధించిన మెజర్మెంట్ బుక్(ఎంబీ)లో రికార్డింగ్ అధికారాన్ని కూడా సచివాలయ ఇంజనీర్లకు ఇవ్వాలని, ఆ మేరకు నిబంధనలకు రూపకల్పన చేయాలని పెద్దాఫీసర్లకు సూచించారు.
0 Comments:
Post a Comment