ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో 1 నుంచి 6వ తరగతి విద్యార్ధులకు ఈ విద్యాసంవత్సరంలో భారీ మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ముఖ్యంగా వారిపై చదువుల భారాన్ని తగ్గించేందుకు వీలుగా విద్యాసంవత్సరంతో పాటు సిలబస్ లోనూ భారీ మార్పులు చేయబోతోంది. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టు తీర్పు ఇంకా పెండింగ్ లోనే ఉన్నందున తెలుగు, ఇంగ్లీష్ మీడియం పాఠ్యాంశాలను కలిపి ముద్రిస్తున్నారు.
మూడు సెమిస్టర్లుగా విద్యాసంవత్సరం...
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు తెరిచే అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ బోధన వరకైనా మార్పులు చేయాల్సిందే అన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది.
దీంతో విద్యా సంవత్సరాన్ని మూడు సెమిస్టర్లుగా విద్యాసంవత్సరాన్ని మార్చబోతున్నారు. అందుబాటులో ఉన్న పని దినాల్లో ఈ మేరకు మార్పులు కూడా చేస్తారు. దీని ఆధారంగా సిలబస్ తో పాటు సెలవు దినాలు, ఇతర అంశాలను కూడా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మూడు భాగాలుగా సిలబస్...
ప్రస్తుతం ఉన్న సిలబస్ లో 30 శాతం తగ్గించేందుకు సిద్దమైన ప్రభుత్వం ఆ మేరకు పాఠ్య పుస్తకాల్లోనూ మార్పులు చేయబోతోంది. కొత్త విధానంలో సబ్జెక్టుకు మూడు టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ మాత్రమే ఉంటాయి. మూడు టెక్స్ట్ బుక్స్ ను మూడు సెమిస్టర్లలో టీచర్లు బోధిస్తారు. వీటితో పాటు వర్క్ బుక్స్ కూడా ఇస్తారు. ఇందులో మొదటి సెమిస్టర్ పుస్తకాలను మాత్రమే ప్రస్తుతానికి ముద్రిస్తున్నారు. రెండో సెమిస్టర్ ప్రారంభమయ్యే నాటికి మిగతా బుక్స్ కూడా విద్యార్ధులకు చేరవేస్తారు.
ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో...
ఒక్కో టెక్ట్స్ బుక్ లో పాఠ్యాంశాలను తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ బాషా పుస్తకాలు మాత్రం ఆయా భాషల్లోనే ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై సర్కార్ నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠ్య పుస్తకాలు ఇంగ్లీష్, తెలుగులో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం తెలుగులోనే బోధన కొనసాగుతుంది. అదే సమయంలో విద్యార్దులు కూడా ఈ పుస్తకాల్లో ఇంగ్లీష్ పాఠాలపై కూడా కొంత మేర అవగాహన తెచ్చుకునే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
పరీక్షల క్రమం ఇలా...
ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని మూడు సెమిస్టర్లుగా విభజిస్తున్నందున ఒక్కో సెమిస్టర్ ముగియగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక సెమిస్టర్ పూర్తి కాగానే తొలి పరీక్ష ఉంటుంది. ఇందులో అప్పటివరకూ పూర్తయిన సిలబస్ పై పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో సెమిస్టర్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలో తొలి సెమిస్టర్లో 20 శాతం, రెండో సెమిస్టర్లో 80 శాతం పాఠ్యాంశాలపై ప్రశ్నలుంటాయి. అలాగే మూడో సెమిస్టర్ పూర్తయ్యాక తొలి రెండు సెమిస్టర్ల నుంచి పదేసి శాతం పాఠ్యాంశాలు, మూడో సెమిస్టర్ నుంచి 80 శాతం పాఠ్యాంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. దీంతో విద్యాసంవత్సరం పూర్తవుతుంది.
0 Comments:
Post a Comment