తొలివిడత కరోనా ఔషధం.. ఐదు రాష్ట్రాలకే!
దిల్లీ: కొవిడ్-19 చికిత్సలో వినియోగించనున్న ఔషధం ‘కొవిఫర్’ను తొలివిడతగా ఐదు రాష్ట్రాలకు అందచేశారు. వీటిలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, దిల్లీతో సహా గుజరాత్, తమిళనాడు, తెలంగాణా ఉన్నాయి. అమెరికాకు చెందిన గిలిద్ సైన్సెస్ అభివృద్ధి చేసిన ‘రెమ్డెసివర్’కు జనరిక్ తయారుచేసి, పంపిణీ చేసేందుకు హైదరాబాద్కు చెందిన హెటిరో ల్యాబ్స్కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. హెటిరో తొలివిడతగా 20,000 వయల్స్ను ఆయా రాష్ట్రాలకు అందచేసింది. మరో రెండు-మూడు వారాల్లో లక్ష వయల్స్ తయారు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, రెండో విడత ఔషధాన్ని కోల్కతా, ఇండోర్, భోపాల్, లఖ్నవూ, పట్నా, భువనేశ్వర్, రాంచి, విజయవాడ, కోచి, తిరువనంతపురం, గోవా నగరాలకు పంపిణీ చేయనుంది.
కొవిఫర్ పంపిణీ ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారా మాత్రమే జరుగుతుందని, మార్కెట్లో కొనుగోలు చేసేందుకు లభించదని హెటిరో వివరించింది. అత్యవసర స్థితిలో ఉన్న కొవిడ్ బాధితుల చికిత్సలో మాత్రమే కొవిఫర్ను వాడనున్నారని సంస్థ తెలిపింది. ఒక్కో కొవిడ్ రోగికి కనీసం ఆరు మోతాదులు అవసరమని.. 100 మిల్లీగ్రాముల మోతాదు రూ.5400 అని సంస్థ వెల్లడించింది. కరోనా బారిన పడిన దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్లో ఇప్పటికే సుమారు 4.73 లక్షల కేసులు, 14,894 మరణాలు నమోదయ్యాయి. కాగా, మొత్తం కేసుల్లో 80 శాతం.. మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్లలోనే కేంద్రీకృతమై ఉన్నట్టు గణాంకాలు తెలియచేస్తున్నాయి.
0 comments:
Post a comment