పోస్ట్.. ఆహారం. పోస్ట్... ఔషధాలు. పోస్ట్.. మామిడిపళ్లు. లాక్డౌన్వేళ తంతితపాలా తనవంతు పాత్ర పోషిస్తోంది. తోకలేని పిట్ట ఆహారాన్ని ఆకలి చిరునామాకు చేరవేస్తోంది. ఆపత్కాలంలో అండగా నిలుస్తోంది. ఈ బృహత్కార్యంలో 17 వేల మంది సైన్యాన్ని ముందుండి నడిపిస్తున్నారు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంధ్యారాణి కన్నెగంటి...సరైన నాయకత్వం ఉంటే.. సమర్థమైన సేవలు ఎలా అందించవచ్చో నిరూపిస్తున్నారు...ఆమెతో వసుంధర మాట కలిపింది... కరోనా వ్యాప్తి, లాక్డౌన్తో అంతటా అభద్రతా భావం. ఈ సమయంలో ఇంటింటికీ తిరుగుతూ విధులు నిర్వర్తించడం అంటే కత్తిమీద సామే.
అందుకే ఆమె సిబ్బందికి ఒక సందేశం ఇచ్చారు. 'మనది అత్యవసర సర్వీసు. జాగ్రత్తగా ఉంటూనే జనం కోసం పని చేద్దాం. ఇది మనకొక మంచి అవకాశం. వాళ్ల నమ్మకాన్ని చూరగొందాం' అని డైరెక్టర్లు, ప్రాంతీయ, జిల్లా అధికారులందరితో చర్చించి వాళ్ల సూచనలు తీసుకున్నారు. పరిస్థితులకు తగ్గట్టు ప్రణాళికలు వేసుకొని అందర్నీ ముందుండి నడిపిస్తున్నారు.
పలు సేవలు ఈ సమయంలో తపాలాశాఖ నిర్వర్తిస్తున్న ప్రధాన బాధ్యత ప్రభుత్వం అందించే రకరకాల పింఛన్లు, కరోనా ఆర్థికసాయం లబ్ధిదారులకు పంపిణీ చేయడం. పేదలకు ఈ కొద్దిమొత్తమే అత్యవసరం కావడంతో ఒక్కసారిగా గుంపులుగా పోస్టాఫీసుల్లోకి పరుగెత్తే అవకాశముంది. ముందే ఈ పరిస్థితి ఊహించిన సంధ్యారాణి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో మాట్లాడారు. భద్రతా ఏర్పాట్లు చేయమని కోరారు. వందల కోట్ల రూపాయల నగదును జిల్లాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలోనే ఐదున్నర లక్షలమందికి నగదు అందేలా చూశారు. దీనికోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సదుపాయాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు. భయం, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏ ఉద్యోగులైనా సరిగా విధులు నిర్వహించలేరు. అందుకే సిబ్బంది భద్రత కోసం మాస్కులు, గ్లవుజులు, శానిటైజర్లు.. అందరికీ అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక చొరవతో ఈ విపత్కర సమయంలో సంధ్యారాణి నేతృత్వంలో తపాలాశాఖ కొత్తగా ప్రారంభించిన సర్వీసులు కొన్ని... * ప్రభుత్వం పేదలకు అందిస్తున్న కరోనా ఆర్థిక సాయం సమయానికి అందేలా టోకెన్ సిస్టం ప్రవేశ పెట్టారు. దీంతో భౌతిక దూరం సాధ్యమైంది. ప్రజలకు సేవలు త్వరగా అందాయి. * వ్యవసాయ, ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చినవారికి మామిడి, బత్తాయి పండ్లను పోస్టల్ వ్యాన్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. * స్త్రీ, శిశు సంక్షేమశాఖ కోరిక మేరకు మెయిల్ వ్యాన్ల ద్వారా పీపీఈ మెటీరియల్ని రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లకు రవాణా చేస్తున్నారు. * 3,700 టన్నుల మెడికల్ కిట్లు, వైద్య సామాగ్రి, ఔషధాల్లాంటి అత్యవసరాలను ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు అందేలా చేశారు. * లాక్డౌన్తో కొన్ని ఔషధ కంపెనీల సప్లై చైన్ సిస్టం దెబ్బతింది. దాంతో తెలంగాణ తపాలాశాఖ ఆ కంపెనీల ఔషధాలను ఇతర రాష్ట్రాలకు చేరవేస్తోంది. ముడిసరకును ఉత్పత్తి కేంద్రాలకు తీసుకొస్తుంది. ఆధార్ ఆధారిత పేమెంట్స్ సేవలు గణనీయంగా పెరిగాయి. ఈ సేవల్లో తెలంగాణా తపాలా శాఖ దేశంలోనే ప్రథమంగా నిలిచింది. * ఈ కష్టకాలంలో అక్షయపాత్ర, ఫౌండేషన్ లక్షలమంది అన్నార్థుల ఆకలి తీరుస్తోంది. తయారైన ఆహారాన్ని సేవా కేంద్రాలకు తరలించడంలో తపాలాశాఖ కీలకపాత్ర పోషిస్తోంది. అడ్డంకులు దాటుకుంటూ ఈ క్రమంలో సంస్థకు కొన్ని ఇబ్బందులూ ఎదురయ్యాయి. కొద్దిరోజుల కిందట బీఎస్ఎన్ఎల్ ప్రధాన కేబుల్ దెబ్బతినడంతో తపాలాశాఖకు చెందిన అన్ని సర్వర్లు మొరాయించాయి. 5,500 పోస్టాఫీసుల్లో సేవలు ఆగిపోయాయి. సంధ్యారాణి వెంటనే స్పందించారు. బీఎస్ఎన్ల్ అధికారులు, టీఎస్ ఆన్లైన్ ఉన్నతాధికారులతో చర్చించి యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించారు.
ఇది సమష్టి విజయం
విపత్కర పరిస్థితుల్లోనూ మేం గణనీయమైన సేవలందిస్తున్నామంటే.. ఈ విజయంలో తపాలా బంట్రోతు నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరి కష్టం ఉంది. రోజూ ఎక్కువ గంటలతోపాటు, వారాంతంలోనూ పనిచేస్తున్నారు. ఈ సమయంలో మేం కొత్త సర్వీసులు ప్రారంభించాం. టెక్నాలజీ, సాఫ్ట్వేర్ల అప్లోడ్.. అప్డేట్ చేశాం. దీనికోసం మా బృందం అహర్నిశలు శ్రమించింది. టీఎస్ ఆన్లైన్, విజన్టెక్ వాళ్లు సాయం చేశారు. ఒక్క ఆదివారమే మావాళ్లు రెండులక్షల మందికి పింఛను డబ్బులు అందజేశారు. ఇది వారి నిబద్ధతకు నిదర్శనం. ప్రస్తుతం మేం కష్టపడి పని చేస్తుండటంతో జనాల్లో మాపట్ల నమ్మకం పెరిగిందని భావిస్తున్నాం.
0 Comments:
Post a Comment