న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 32 మంది కరోనాతో మరణించినట్టు కేంద్ర వైద్య అరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 170కి చేరింది. అలాగే, నిన్నటి నుంచి ఇప్పటి వరకు 773 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,494కు పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. 402 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు.
ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వైరస్ సంక్రమించకుండా నియంత్రణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వైరస్ కట్టడికి ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరిక్విన్ నిల్వలు చాలినన్ని ఉన్నాయని అగర్వాల్ పేర్కొన్నారు. కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉందని అగర్వాల్ వివరించారు.
0 Comments:
Post a Comment