స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. ఇందులో రుణాలు కూడా ఒక భాగం. బ్యాంక్ ఎన్నో రకాల రుణాలు ఆఫర్ చేస్తోంది. పర్సనల్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్ వంటివి ఇందులో భాగమే. ఇవేకాకుండా బ్యాంక్ ముద్రా లోన్స్ కూడా అందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్ 8న వ్యాపారులు, చిన్న ఎంట్రపెన్యూర్లు లక్ష్యంగా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) స్కీమ్ ఆవిష్కరించారు. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. వీటిని ముద్రా లోన్స్ అని పిలుస్తారు. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వంటివి ఈ తరహా రుణాలు అందిస్తున్నాయి.
ముద్రా స్కీమ్ కింద లోన్ తీసుకోవాలని భావించే వారు ఒక విషయం తెలుసుకోవాలి. ముద్రా లోన్స్లో మూడు రకాలు ఉంటాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు విభాగాలు ఉంటాయి. రూ.50,000 లోపు రుణాలు శిశు విభాగం కిందకు వస్తాయి.
రూ.50 వేల నుంచి రూ.5 లక్షలలోపు రుణాలను కిషోర్ విభాగం కిందకు, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలలోపు రుణాలు తరుణ్ విభాగం కిందకు వస్తాయి. ఎస్బీఐ ముద్రా లోన్స్ కింద అర్హత కలిగిన వ్యక్తి గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. దీన్ని పెట్టుబడిగా పెట్టి (వర్కింగ్ క్యాపిటల్) వ్యాపారం ప్రారంభించొచ్చు. ఇప్పటికే బిజినెస్ చేస్తూ ఉంటే దాన్ని మరింత విస్తరించుకోవచ్చు.
మ్యానుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), ట్రేడింగ్, సర్వీసెస్ రంగంలోని వ్యాపారాలకు రుణాలు అందజేస్తారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు బిజినెస్లకు కూడా లోన్స్ తీసుకోవచ్చు. అంటే షాప్ పెట్టుకోవడానికి, త్రి/ఫోర్ వీలర్ కొనుగోలు చేసేందుకు, బ్యూటీపార్లర్/జిమ్ వంటివి పెట్టుకోవడానికి, ఇంకా ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు లోన్ తీసుకోవచ్చు. రూ.50,000 వరకు ఎలాంటి మార్జిన్ ఉండదు.
ఈ లిమిట్ దాటితే 10 శాతం మార్జిన్ ఉంటుంది. తీసుకున్న రుణాన్ని 3 నుంచి ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 6 నెలల వరకు మారటోరియం ఉంటుంది. అంటే ఈ కాలంలో ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతంగా ఉంటుంది. శిశు విభాగానికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వర్తించదు. ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు నిర్ణయమౌతాయి. బ్యాంక్లో ముద్రా స్కీమ్ కింద లోన్ తీసుకున్న వారికి ముద్రా రూపే కార్డు లభిస్తుంది.
ఇది డెబిట్ కార్డు. ముద్రా లోన్ అకౌంట్లో ఇది లింక్ అయ్యి ఉంటుంది. దీనిసాయంతో ముద్రా అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. దీంతో ముద్రా కస్టమర్ లావాదేవీలు డిజిటలైజ్ అవుతాయి.
క్రెడిట్ హిస్టరీ కూడా క్రియేట్ అవుతుంది. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లలో కూడా ఇది పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఏ ఏటీఎం నుంచైనా డబ్బు తీసుకోవచ్చు. ముద్రా స్కీమ్ కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఒకటేమో దగ్గరిలోని బ్యాంకుకు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లకుండానే ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అప్లై అని ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. https://www.udyamimitra.in/
0 Comments:
Post a Comment