రాజధానిలో 144సెక్షన్..హైకోర్టు ఆగ్రహం
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్యాక్ట్ 30 అమలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని గ్రామాలకు చెందిన పలువురు మహిళలు, రైతులు ఈరోజు దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ వచ్చే సోమవారానికి వాయిదా కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. ఈ అంశంలో త్వరగా విచారణ జరపాల్సిన అవసరముందని హైకోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో శుక్రవారంలోపు ప్రమాణపత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు రిట్ పిటిషన్లు వేశారని రాజధాని ప్రాంత రైతులు, మహిళల తరఫు న్యాయవాది తెలిపారు. అఫిడవిట్ ద్వారా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరిందన్నారు. కోర్టుకు ఇచ్చిన దృశ్యాల్లో పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోందని చెప్పారు. రాజధాని గ్రామాల్లో మహిళలు ప్రశాంతంగా నిరసనలు తెలుపుతున్నారన్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించారనే ఆరోపణలతో మహిళలు పిటిషన్లు వేసినట్లు చెప్పారు.
రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్టు 30 అమలును సవాల్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టు వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఆ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
0 Comments:
Post a Comment