తారుమారవుతున్న ఆధిక్యాలు 12.30 PM
రాంచీ: ఝార్ఖండ్లో ఎన్నికల ఫలితాలు క్షణక్షణం మారుతున్నాయి. ప్రస్తుతం భాజపా 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా కొనసాగుతుండగా.. కాంగ్రెస్ కూటమి 40 స్థానాల్లో ముందంజలో ఉంది. ఓ దశలో కాంగ్రెస్-జేఎంఎం కూటమి మెజార్టీ మార్క్ దాటి ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్లుగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరేనే తమ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు ఏజేఎస్యూ, జేవీఎంలతో అటు కాంగ్రెస్, ఇటు భాజపా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఓ దశలో ఆధిక్యంలో కూటమి మెజార్టీ మార్క్ దాటడంతో జేఎంఎం, కాంగ్రెస్ వర్గాలు ఆయా ప్రాంతాల్లో సంబరాలు జరుపుకొన్నాయి. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ స్వల్ప మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న హేమంత్ సోరేన్ బర్హేట్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. దుమ్కాలో వెనకబడడం గమనార్హం. ప్రస్తుతం ఆయా పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్న స్థానాల సంఖ్య ఇలా ఉంది..
కాంగ్రెస్ కూటమి 40
భాజపా 30
ఏజేఎస్యూ 4
జేవీఎం 3
ఇతరులు 4
ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి. 11.00 AM
రాంచీ: ఝార్ఖండ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాంగ్రెస్-జేఎంఎం కూటమి, భాజపా పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి మెజార్టీ మార్క్ను దాటింది. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జంషెడ్పూర్ తూర్పులో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరేన్ కూడా పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్న పార్టీలైన ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేఎస్యూ), ఝార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) పార్టీల పాత్ర కీలకంగా మారింది. దీంతో భాజపా ఆ పార్టీల నేతల్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భాజపా అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయా పార్టీలు ఆధిక్యంలో ఉన్న స్థానాలు ఇలా ఉన్నాయి..భాజపా 28
కాంగ్రెస్+జేఎంఎం+ఆర్జేడీ 43
జేవీఎం(పీ) 4
ఏజేఎస్యూ 3
ఇతరులు 4
మెజారిటీ కి మ్యాజిక్ ఫిగర్ 41
0 Comments:
Post a Comment