వృత్తి వ్యాపకాల్లో పడి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పరగడుపున తీసుకొనే ఆహారం విషయంలో తప్పక ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనని సూచిస్తున్నారు. ఇందుకు వారు సూచిస్తున్న కొన్ని సూచనలు..
ఉదయం నిద్ర లేచిన వెంటనే తగినన్ని నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పెద్ద ప్రేగు శుభ్రముగా అయి జీర్ణ వ్యవస్థ పనితీరు పెరగటంతో బాటు కండరాలకు ఉత్తేజం కలుగుతుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగితే కొవ్వు కూడా కరుగుతుంది. అవసరమైతే తేనె కలుపు కోవచ్చు.
ఉదయం పూట తప్పక తేలిగ్గా అరిగే సాత్వికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా.. అల్పాహారంలో ఘాటైన మసాలాలూ, గ్రేవీ కూరలు వద్దు. దీనివల్ల పొట్టలో తిప్పినట్లుండటం, రోజంతా నిరుత్సాహంగా ఉండే ప్రమాదం ఎక్కువ. అందుకే చపాతీ, పూరీ, పులావ్ లకు బదులు ఇడ్లీ, వడ, ఓట్స్ వంటివి తీసుకోవటం మంచిది. అల్పాహారంగా మ్యాగీ అసలే వద్దు. ఎక్కువకాలం ఇలాంటి మసాలాలతో అల్సర్ ముప్పు తప్పదు.
చాలామంది లేవగానే బెడ్ కాఫీ, టీ తాగుతుంటారు గానీ వీటిని పరగడుపున తీసుకోవటం వల్ల హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఈ అలవాటున్నవారు అందుకే మొదట గ్లాసు నీళ్లు తాగి.. ఓ పావుగంట తరవాత వీటిని తీసుకోవాలి.
కొందరు ఉదయాన్నే నారింజ, బత్తాయి, టమోటో రసం తీసుకొంటారు.దీనివల్ల వాటిలోని ఆమ్లం ఎసిడిటీ, గుండెలో మంట, అల్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ కూడా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది గనుక ఇలాంటివి తినేముందు వేరే పదార్థమేదైనా తినాలి. అల్పాహారంగా టొమాటో బాత్ లేదా, టొమాటో రైస్ వంటివి కూడానా వద్దు.
ఉదయాన్నే మొలకెత్తిన గింజల్ని తినేవారు అందులో బొబ్బర్లు లేకుండా చూసుకోవాలి. బొబ్బర్లు చాలా ఆలస్యంగా జీర్ణం అవుతాయి కనుక ఖాళీ కడుపుతో తింటే అలసట, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.
కొందరు నిద్రలేవగానే ఖాళీ కడుపుతో వాకింగ్ లేదా జాగింగ్కు వెళ్లిపోతారు. దీనివల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరగదు. దీనికి బదులు వ్యాయామానికి వెళ్లే 10 నిమిషాల ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి , ఆ తర్వాత ఓ కప్పు గ్రీన్ టీ తాగి వెళ్లడం మంచిది. యోగాకూ ఈ నియమం వర్తిస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో అరటి పండు తినరాదు. అరటి పండులో అధికంగా ఉండే మెగ్నీషియం ఒక్కసారి శరీరానికి అందటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు.
రాత్రి పొద్దుపోయేవరకు పనిచేసే కాల్ సెంటర్ ఉద్యోగులు, పాత్రికేయులు ఏ అర్ధరాత్రికో తిని, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో వీరు నిద్రలేవగానే కనీసం అరా లీటరు నీరు తాగితే రాత్రి ఆహారపు ప్రభావము తగ్గుతుంది.
పరగడుపున సోడా, శీతల పానీయాలు, బీర్ అసలే వద్దు. వీటి వినియోగం వల్ల జీర్ణాశయ పనితీరును దెబ్బతీసే ఆమ్లాలు విడుదలవుతాయి. కొందరికి వికారం, వాంతుల వంటివీ తప్పవు.
More Health tips... మరింత ఆరోగ్య సమాచారం కోసం...New
0 Comments:
Post a Comment