నెలాఖరులోగా పాఠశాలలకు విద్యా కమిటీలు.
ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశాలు
అక్టోబరు నుంచి పనిచేసేలా విధి విధానాలు విడుదల
ఎన్నికల నిర్వహణ అధికారులుగా ఎంఈవోలు
సర్కారు బడులను సక్రమంగా నిర్వహించడానికి వీలుగా పాఠశాల విద్యా కమిటీలను ఏర్పాటు చేయాలని సర్వశిక్షా అభియాన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఎన్నికలను పూర్తిచేసి అక్టోబరు ఆరంభం నుంచి ఈ కమిటీలు పనిచేసేలా ఆ శాఖ ఉన్నతాధికారి వి.చినవీరభద్రుడు అన్ని జిల్లాలకు విధి విధానాలను విడుదల చేశారు. దీంతో విద్యాశాఖలో ఈ ప్రకియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలాల్లో ఎంఈవో లను ఎన్నికల నిర్వహణ అధికారులుగా నియమించారు. వీరు వివిధ పాఠశాలల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు సీనియర్ ఉపాధ్యాయులను నియమిస్తున్నారు.
గతంలో పాఠశాల విద్యా కమిటీలకు జరిగిన ఎన్నికల కాల పరిమితి గత ఆగస్టుతో పూర్తియింది. అయినప్పటికీ మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఈ ఎన్నికలకు శ్రీకారం చుట్టింది.
ఎన్నికల నిర్వహణ విధానం
పాఠశాలల విద్యా కమిటీని విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నుకుంటారు.
వారిలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా ఉంటారు.
ప్రతి తరగతి నుంచి ముగ్గురు తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రాథమిక పాఠశాలలో గరిష్ఠంగా 15 మంది సభ్యులుండాలి.
ఈ విధంగా ఎన్నికైన వారిలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు.
ఈ ఎన్నికల విధానంలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది.
పాఠశాలల అభివృద్ధిలో విద్యా కమిటీలు కీలకపాత్ర వహిస్తాయి. ప్రస్తుతం అమ్మఒడి పథకం అమలు జరుగుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులచే బ్యాంకు ఖాతాలను తెరిపించడం, అందులో ప్రభుత్వ నిధులు జమ అయ్యేలా చూడడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
కమిటీల విధి నిర్వహణ
ఈ నెలాఖరులోగా ఎన్నికైన కమిటీలకు అక్టోబరు మొదటి వారంలో మండల కేంద్రాలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తర్వాత ప్రతినెలా ఈ కమిటీ సమావేశమవ్వాలి. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు ఇతర సదుపాయాలు కల్పించడానికి వీలుగా తీర్మానాలు చేసి అమలు చేయాలి.
ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పాఠశాల నిర్వహణ, ఇతర గ్రాంటులను ఖర్చు చేయడానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో జాతీయ బ్యాంకులో ఉమ్మడి ఖాతాను ప్రారంభించాలి.
బోధన, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పిల్లల హాజరు, విద్యా ప్రమాణాల పెంపుదల వంటి పలు అంశాలను ఈ కమిటీలు చూడాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉన్న కమిటీలు నామమాత్రంగా పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తినందున కొత్తగా ఎన్నికైన కమిటీలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటారు.
కాగా పాఠశాల విద్యా కమిటీల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు.
Also... Read.....
0 Comments:
Post a Comment