First Sai baba temple at Bhivpuri.-ప్రపంచంలోనే తొలి బాబా గుడి - భివ్పురి. ఆ కథేంటో తెలుసుకుందామా..?
ముంబై, పూనెలకు మధ్య ఉన్న రైలు మార్గంలో కనిపించే ఒక చిన్న గ్రామం భివ్పురి. 1916లో ఇక్కడ నిర్మించిన సాయిబాబా ఆలయమే ప్రపంచంలోని మొట్టమొదటి బాబా గుడి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తూ బాబాగారే అందించడం ఒక విశేషం అయితే, ఈ ఆలయాన్ని నిర్మించిన కేశవ్ రామచంద్ర ప్రధాన్ ఒక నాస్తికుడు కావడం మరో విశేషం.
రామచంద్ర ప్రధాన్
భివ్పురి గ్రామానికి చెందిన రామచంద్ర ప్రధాన్ ఒక సాధారణ గుమాస్తా. ముంబైలో నివసించే ఒక పార్శీ వర్తకుని వద్ద అతను పనిచేసేవాడు. తన యజమాని ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడమే రామచంద్ర పని. అలా పని మీద రామచంద్ర మన్మాడ్, నాసిక్ వంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు. రామచంద్రకి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితునికి బాబా మీద మహా గురి. రామచంద్ర షిరిడీకి దగ్గరగా వెళ్లినప్పుడల్లా, తనతో కలిసి షిరిడీకీ రమ్మని ప్రాధేయపడేవాడు స్నేహితుడు. కానీ చిన్నప్పటి నుంచి దేవుళ్లన్నా, మహత్యాలన్నా నమ్మకం లేని ప్రధాన్, స్నేహితుడి మాటలను లెక్కచేసేవాడు కాదు. అయితే చివరికి ఒకసారి షిరిడీకి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు ప్రధాన్. కాకపోతే తాను సత్రంలోనే ఉండిపోతాననీ, బాబా ఉన్న మసీదులోకి అడుగుపెట్టననీ షరతు పెట్టాడు.రామచంద్రని సత్రంలోనే ఉంచి తాను మాత్రం హారతి వేళ బాబాను దర్శించుకునేందుకు వెళ్లిపోయాడు స్నేహితుడు. హారతి మొదలైంది. మధురమైన హారతి పాట, లయబద్ధమైన సంగీతమూ మసీదు నుంచి వినిపిస్తోంది. ఆ శబ్దాలకు ప్రధాన్ కాలు నిలువలేదు. తనకు తెలియకుండానే నడుచుకుంటూ మసీదులోకి అడుగుపెట్టాడు ప్రధాన్. అడుగుపెట్టడమే కాదు! అక్కడ ఉన్న బాబాని చూసి మైమరచిపోయాడు. ఆ మరపులోనే ఆయన వద్దకు వెళ్లి నిల్చొన్నాడు. ప్రధాన్ని చూసిన బాబా తన అలవాటు ప్రకారం దక్షిణను అడిగారు. అప్పటికీ ప్రధాన్ మైకంలోనే ఉన్నాడు. తన యజమాని కోసం వసూలు చేసిన 2,500 రూపాయలను తీసి మారు మాట్లాడకుండా బాబా చేతిలో ఉంచాడు.
0 comments:
Post a Comment